nirmala sitharaman explains about pm modi fff economic model and tech support
ఇరాన్ యుద్ధ సంక్షోభంతో భారత ఆర్థిక వ్యవస్థ కొత్త సవాళ్లను ఎదుర్కునే దిశగా పయనిస్తోంది. ఇప్పటికే పెరిగిన మరియు పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు విదేశీ మారక నిల్వల ఒత్తిడి వంటి సవాళ్లను భారత్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా PM Modi సూచించిన “FFF మోడల్” గురించి ప్రస్తావించారు. ఈ FFF అంటే ఫ్యూయల్, ఫెర్టిలైజర్ మరియు ఫారెక్స్ అని ఆమె మరోసారి స్పష్టం చేశారు. భారత ఆర్థిక స్థిరత్వానికి ఈ మూడు అంశాలు చాలా ముఖ్యమని మరియు ఈ మూడు అంశాలపై దేశం దృష్టి పెట్టాలని ఆమె పేర్కొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ తో ముడిపడిన మూడు కీలక అంశాలు మరియు వాటి ప్రాధాన్యత వివరించే మోడల్ ఈ FFF మోడల్. ఇందులో Fuel (ఇంధనం), Fertiliser (ఎరువులు) మరియు Forex (విదేశీ మారక నిల్వలు) లు ఉన్నాయి. ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దేశం. కాబట్టి, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు కనుక పెరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే, ఇంధనం పొదుపు చేయడానికి ప్రధాని పిలుపునిచ్చారు.
వ్యవసాయ రంగానికి అవసరమైన యూరియా, అమోనియా వంటి ఎరువుల ధరలు కూడా గ్లోబల్ పరిస్థితుల వల్ల మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎరువుల ధరలు పెరుగుదల కారణంగా, దీనిపై కూడా పొదుపు చర్యల కోసం శ్రద్ద వహించాలని తెలిపారు. డాలర్ తో రూపాయి మారకం విలువ, దిగుమతుల ఖర్చు మరియు విదేశీ పెట్టుబడులపై ఫారెక్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే, పొదుపు చర్యల లిస్ట్ లో దీన్ని కూడా చేర్చారు.
ఈ మూడు రంగాలను సమతుల్యంగా నిర్వహించడం ఇప్పుడు భారత ఆర్థిక వ్యూహం లో అత్యంత కీలకమైన విషయం అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అందుకే, ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించండి మరియు విదేశీ మారక నిల్వలు పరిరక్షణ కోసం బంగారం కొనుగోళ్లను తగ్గించడం వంటివి చేయాలని ప్రధాని సూచనలు చేశారని FFF మోడల్ గురించి నిర్మలా సీతారామన్ విశదీకరించి తెలిపారు.
నిర్మలా సీతారామన్ ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం నిలకడగా ఉంది మరియు దేశీయ డిమాండ్ బలంగా కొనసాగుతోందని తెలిపారు. అంతా సవ్యంగా ఉన్నా కూడా బాహ్య పరిస్థితులు పెద్ద సవాళ్లు విసురుతున్నాయని ఆమె అంగీకరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ FFF వ్యూహంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఎలాగంటే, ఇంధన దిగుమతుల పై ఆధారపడకుండా ఉండేందుకు భారత్ భారీగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ (EVలు), సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతోంది.
AI ఆధారిత వ్యవసాయ టెక్నాలజీ ని ఉపయోగించి మరింత ఖచ్చితమైన వ్యవసాయం మరియు స్మార్ట్ ఫర్టిలైజర్ ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఎరువుల కొరత లేదా ఎరువుల రేటు పెరగకుండా చూసే అవకాశం ఉంటుంది.
Also Read: టాప్ రేటెడ్ 5.1 Dolby సౌండ్ బార్ 6 వేల బడ్జెట్ ప్రైస్ అందుకోండి.. ఎక్కడంటే.!
UPI అంతర్జాతీయ విస్తరణ, RuPay గ్లోబల్ నెట్ వర్క్ మరియు డిజిటల్ రూపాయి వంటి ప్రాజెక్టులు విదేశీ మారక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతున్నాయి మరియు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
2026 బడ్జెట్ లో కూడా మౌలిక సదుపాయాలు, MSMEs, స్కిల్లింగ్, నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నవతరం టెక్నాలజీ దేశ ఆర్థిక పరిస్థితుల్లో ప్రధాన పాత్ర పోషించే విధంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.