ఆధార్ అప్ కమింగ్ సర్వీస్: ఇంటి వద్దనే ఆధార్ అప్డేట్
ఇండియాలో ముఖ్యంగా అడిగే పత్రం ఆధార్ కార్డ్
ఆధార్ కార్డ్ లో ఏవైనా తప్పులు ఉంటే
ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండానే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు
ఇండియాలో అన్ని అవసరాలకు ముఖ్యంగా అడిగే పత్రం ఆధార్ కార్డ్. అందుకే, ఆధార్ ఖచ్చితమైన మరియు సరైన వివరాలను కలిగి ఉండడం అవసరం. కానీ, ఆధార్ కార్డ్ లో ఏవైనా తప్పులు ఉంటే? ఈ విషయం మీకు ఇబ్బందిని కలిగించవచ్చు. మరి మీ ఆధార్ వివరాలను సరిచేసుకోవాలంటే కూడా సమస్యే. ఎందుకంటే, ఆధార్ కేంద్రాలకు వెళ్లి గంటలకు గంటలు క్యూలో వేచిచూడవల్సి వస్తుంది. అయితే, UIDAI మరియు పోస్టల్ డిపార్ట్ సంయుక్తంగా తీసుకొచ్చిన కొత్త విధానం వలన ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండానే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.
UIDAI దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్వీస్ ను ఆధార్ సర్వీస్ కోసం ఉపయోగించుకోనుంది. ఆధార్ యూజర్లు ఇంటివద్దకు వచ్చే పోస్ట్ మెన్ ద్వారా ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ వలన ఇంటి నుండి కదలకుండనే అవసరం ఉన్న వారు తమ ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ప్రజలకు ఈ సర్వీస్ అందించడానికి దేశవ్యాప్తంగా ఉన్న 650 పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ లను మరియు అందులోని పోస్ట్ మెన్ లను ఉపయోగించుకోనుంది.
UIDAI అధికారికంగా ప్రకటించిన ప్రకారం, ప్రస్తుతానికి కేవలం పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా ఆధార్ మొబైల్ నంబర్ మాత్రమే అప్డేట్ చేస్తుంది. ఒకవేళ ఇది కనుక పుర్తిస్థాయిలో విజయవంతమైతే కనుక ఆధార్ కి సంబంధించి పూర్తి సేవలను పోస్ట్ ఆఫీసుల ద్వారా నిర్వహించవచ్చని కూడా తెలియవస్తోంది. ఇదే గనుక జరిగితే ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు ఇంటి వద్ద నుండే ఆధార్ కార్డ్ అప్డేట్ మరియు మరిన్ని సర్వీసులు పొందవచ్చు.