union minister jitendra singh says india must change its mindset to lead the next technology revolution in ditaa 2026
DITAA 2026: Digit India’s Top Appliance Awards 2026 కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి, జితేంద్ర సింగ్, శాస్త్ర సాంకేతిక రంగం, స్టార్టప్ లు మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. సాంకేతిక పురోగతి వేగంగా జరుగుతున్నప్పటికీ, దాని వల్ల లభించే అవకాశాలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే వ్యక్తులు కూడా తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుని కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
ఈ వేదికపై మాట్లాడుతూ “భారతదేశం ఇకపై కొత్త సాంకేతికతలు ఇతర దేశాల నుంచి రావాలని ఎదురుచూసే దేశం కాదు. దానికి బదులుగా, క్వాంటమ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ మరియు అంతరిక్ష ఆవిష్కరణలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో తొలి దశలోనే భాగస్వామ్యం చేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచింది” అని కేంద్ర శాస్త్ర అండ్ సాంకేతిక శాఖ, భూ విజ్ఞాన శాఖ మంత్రి, అలాగే ప్రధానమంత్రి కార్యాలయం (PMO), సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు అండ్ పెన్షన్ల శాఖ (PP/DoPT), అణుశక్తి మరియు అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
భారతదేశంలో మారుతున్న సాంకేతిక రంగం గురించి ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అత్యాధునిక సాంకేతికతలను స్వీకరించే విషయంలో భారత్ ఇక వెనుకబడిన దేశం కాదని డాక్టర్ సింగ్ అన్నారు. ముఖ్యంగా, “నేడు క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో తొలి దేశాల్లో మన దేశం కూడా ఒకటి” అని ఆయన పేర్కొన్నారు. అలాగే, అంతరిక్ష రంగం మరియు ఇతర శాస్త్రీయ పరిశోధన విభాగంలో కూడా భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు.
ప్రపంచ స్థాయిలో పోటీపడేందుకు అవసరమైన ప్రతిభ భారతదేశానికి ఎప్పటినుంచో ఉందని, అయితే గతంలో ఆవిష్కరణలకు అవసరమైన అనుకూల వాతావరణం లోపించిందని ఆయన అన్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని, ప్రపంచ ప్రమాణాలను అనుసరిస్తూనే ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడే సాంకేతికతలను భారత్ అభివృద్ధి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా చిన్న పట్టణాల విద్యార్థుల విషయంలో స్మార్ట్ ఫోన్ లు విద్యా రంగాన్ని ఎలా మార్చాయో డాక్టర్ సింగ్ వివరించారు. ముఖ్యంగా, ఉగ్రవాద ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పట్టణానికి చెందిన విద్యార్థిని, ఎలాంటి కోచింగ్ లేదా ఇతర వనరులు అందుబాటులో లేకపోయినా IIT-JEE లో విజయం సాధించిన ఘటనను ఆయన గుర్తుచేశారు. ఆమె అది ఎలా సాధించిందని తాను అడగగా, ఆమె తన ఫోన్ ను చూపిస్తూ, “అంకుల్, రోజుకు 14 గంటలు, 8 నెలలు… IIT క్రాక్ చేశాను – అంతా ఇందులోనే ఉంది” అని చెప్పిందని ఆయన గుర్తు చేసుకున్నారు. రోజుకు 14 గంటల పాటు 8 నెలలపాటు స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి చదవడం వల్లే తాను విజయం సాధించానని ఆమె వివరించిందని ఆయన తెలిపారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ అభిప్రాయం ప్రకారం, సాంకేతికత “అవకాశాలను ప్రజాస్వామ్యీకరించింది (democratised opportunities)” మరియు నాణ్యమైన విద్యను మరింత అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల చిన్న పట్టణాల విద్యార్థులు కూడా అత్యుత్తమ ప్రతిభావంతులతో సమానంగా పోటీ పడే అవకాశం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రైవేటు కంపెనీలకు మరింత భాగస్వామ్య అవకాశాలు కల్పించిన తర్వాత భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ (Space Economy) వేగంగా విస్తరించింది. సుమారు ఐదు నుంచి ఆరు సంవత్సరాల క్రితం అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ రంగానికి తెరవడంతో ఈ వృద్ధికి ఊతమిచ్చిందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ ఇప్పటికే దాదాపు 9 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుందని, రాబోయే 8 నుంచి 9 సంవత్సరాలలో అది 40 నుంచి 45 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని కూడా సింగ్ చెప్పారు.
“కేవలం ఐదేళ్లలోనే మన దేశంలోని ఒక స్టార్టప్ రాకెట్ను ప్రయోగించడమే కాకుండా, యూనికార్న్ కంపెనీగా కూడా ఎదిగింది” అని ఆయన అన్నారు. Skyroot ను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సామర్థ్యాలను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తన ప్రసంగం ప్రారంభంలోనే కేంద్ర మంత్రి, సాంకేతిక పురోగతి ఒక్కటే సరిపోదని, సమాజం కూడా మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
“మనకు కావాల్సింది ఒక్కటే… మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం” అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ సాంకేతికతలకు నాయకత్వం వహించేందుకు అవసరమైన ప్రతిభ, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ (Innovation Ecosystem) మరియు శాస్త్రీయ సామర్థ్యాలు ఇప్పటికే భారతదేశానికి ఉన్నాయని, ప్రజలు కొత్త ఆలోచనలు మరియు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటే భారత్ ఆ రంగాల్లో ముందంజలో నిలవగలదని ఆయన అన్నారు.